12/10/2021
New Book
ఉద్యమానికి అక్షరరూపమే "బ్లూ స్కార్ఫ్"
రచయిత : ఎం . విప్లవకుమార్
Mrp - 150/-
Pages - 128
ORDER : 8332995395 Ph/whatsup
Available : NavaTelangana Publishing House Nizamabad
సామాజిక ఉద్యమాలు సాహిత్యానికి ముడిసరుకును అందించడం, సాహిత్యంలో వస్తుశిల్పాల విస్తరణకూ అభివద్ధికీ దోహదం చేయడం, తిరిగి ఆ సాహిత్యరచనలు సామాజిక ఉద్యమాలకు ప్రేరణగా నిలవడం, ఈ పరస్పర ప్రభావాల, అన్యోన్య చర్య-ప్రతిచర్యల పరిణామం సామాజిక సాహిత్య చరిత్రలో సాధారణమైన విషయమే. ఈ సాధారణ నిర్ధారణకు ఒక ప్రతిఫలనంగా సాగిన ఉద్యమానికీ ఒక అక్షరరూపమే బ్లూస్కార్ఫ్ నవల.
తెలుగు నేల మీద తరతరాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాలు జరిగాయి.. జరుగుతున్నాయి. ఇందులో విద్యార్థి, యువజన, రైతాంగ, కార్మిక, మహిళా, దళిత, ఆదివాసి సమస్యల మీద సాగిన వివిధ ఉద్యమాలు, ప్రయత్నాలు, ఆలోచనలు ఉన్నాయి. ఈ అన్ని వర్గాలకు విడివిడిగా సమస్యలు ఉన్నప్పటికీ, ఆ సమస్యల మీద విడివిడి పోరాటాలు జరిగినప్పటికీ, ఆ సమస్యల అంతిమ పరిష్కారం సాయుధ పోరాటం ద్వారా, వ్యవస్థ మార్పు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే రాజకీయ దక్పథమే విప్లవోద్యమం. విభిన్న ఉద్యమాలన్నిటికీ విద్యుత్ ఉద్యమం ఒక స్ఫూర్తి.. ఒక ప్రేరణ.
విద్యుత్ ఉద్యమం జరిగి రెండు దశాబ్దాలు పూర్తవుతున్నది. మూడు దశాబ్దాల క్రితం దేశంలో ప్రారంభమైన సరళీకరణ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000లో జరిగిన విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమం ఒక మైలురాయి. ఆనాటి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా ప్రయివేటీకరించడానికి నిర్ణయించుకుని దానిని సానుకూలం చేయడానికి భారీగా విద్యుత్ చార్జీలను పెంచింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాపితంగా మూడు నెలలపాటు పట్టువిడవకుండా విశాలమైన ప్రజా ఉద్యమం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత అంతటి ప్రాధాన్యత కల్గిన ఉద్యమం ఇది. ఉద్యమానికి పరాకాష్టగా 2000 ఆగస్టు 28న హైదరాబాద్లో జరిగిన మహా ప్రదర్శనను విచ్ఛిన్నం చేసి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కాల్పులకు తెగబడింది. ముగ్గురు యువకులు అమరులయ్యారు. పదుల సంఖ్యలో తుపాకి కాల్పుల్లో గాయపడ్డారు. వందల సంఖ్యలో పోలీసుల లాఠీఛార్జీలో క్షతగాత్రులయ్యారు. ఆనాడు ప్రాణబలిదానం చేసిన యువకుల త్యాగం వధాపోలేదు. ఆ ఉద్యమం నేటికి సమ్మెటపోటై పాలకులు అమలు చేస్తున్న ప్రమాదకర సంస్కరణలను ప్రతిఘటించడానికి ఇప్పటికీ స్ఫూర్తినిస్తున్నది. ఈ నేపథ్యంలో విప్లవ్ రాసిన ''బ్లూ స్కార్ఫ్'' నవలలో విద్యుత్ ఉద్యమం సందర్భంలో విద్యార్థి సంఘం నిర్వహించి మిల్టెంట్ పాత్ర, రైతుల పోరాటం, చావులు ఇలా ఒకటారెండా ఆనాటి ప్రతి దశ్యాన్ని కండ్ల ముందు నిలుపుతుంది.
''బ్లూ స్కార్ఫ్'' వచనం కాదు. సందర్భోచితంగా, సమయోచితంగా ఆయా పాత్రలు పాటలు పాడుతాయి. ఉపన్యాసాలు ఇస్తాయి. ఆ అక్షరాలు జన చైతన్యమై ఉద్యమానికి ఊపిరవుతాయి. గ్రామీణ అనుబంధాలను తెలుపుతూనే ఏండ్లకెండ్లు కరువుతో సహజీవనం చేసిన వారి బాధలు, కష్టాలు చదువుతుంటే కండ్లు నీటి చెలమలవుతాయి. ఆనాటి ప్రభుత్వ పాలనలో వ్యవసాయం చిన్నాభిన్నమైంది. వానలు లేక కరువు తాండవమాడి రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. ఆంధ్రరాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిన పరిస్థితి. అప్పులు కట్టలేని అసహాయులపై బ్యాంకు అధికారుల నిరంకుశ జప్తులను ఎలా అడ్డుకోవలసివచ్చింది? ఈ వ్యవసాయ సంక్షోభం విద్యుత్ మహౌజ్వల పోరాటానికి మూలవనరు ఎలా అయింది. ఈ క్రమంలో నాయకులు నిర్దేశంలో విద్యార్థి, యువత ఎలాంటి చైతన్యవంతమైన పాత్ర పోషించారు? అనే విషయాలు విప్లవకుమార్ ఒక రచయితగా, ఒక ఉద్యమ నాయకుడిగా రెండు దశాబ్దాల తర్వాత ఆ పోరాట స్ఫూర్తికి అక్షర రూపం ఇచ్చి మన ముందు ఆవిష్కరించారు.
ఈ కథనంలో ఎక్కడా అతిశయోక్తులు కాని, వాస్తవాలకు దూరమైన విషయాలు మచ్చుకైనా లేవు. అందుకే ఈ పుస్తకం చదువుతుంటే అప్పటి కార్యకర్తలు, నాయకులకు నాటి పోరాట అనుభవాలు మదిలో కదలాడతాయి. కొత్తగా విద్యార్థి ఉద్యమంలోకి వచ్చిన వారికైతే రోమాలు నిక్కబోడు చుకుంటాయి. చదవడం ప్రారంభించగానే ఒక సీరియస్ సబ్జెక్ట్ అనే విషయం అర్థమైనా ఉత్కంఠ భరితంగా, ఆసక్తితో తరువాత ఏం జరిగిందని చదువే విధంగా కథను నడిపించాడు. అంతే కాదు అంతర్లీనంగా ఒక ప్రేమ బంధాన్ని పాఠకుడికి తెలియకుండానే అల్లి చివరకు కండ్ల నీళ్లు పెట్టిస్తాడు. అంటే పాఠకులు ఆయా పాత్రలలో తమని ఊహించుకుంటూరు. తమ చూట్టూ ఉన్న సమాజాన్ని అందులో భాగంగానే చూస్తారు.
రచయిత కేవలం విద్యుదుద్యమం వివరాలు అందించడానికే పరిమితం అయి ఉంటే ఈ నవలకు విభిన్నత, విలక్షణత ఉండేవి కావు. మేము సైతం అన్నట్టు ఆ పోరాటంలో సమిధలు అందించిన విద్యార్థుల కండ్లలోంచి దాన్ని చూపించారు. వారు స్వతహాగా రైతు బిడ్డలే గాక ఉద్యమ వారసులు.. కథానాయకుడు రావణ్ తండ్రి శివయ్య స్వతహాగా ఉద్యమకారుడు. కొడుకును పోరుబాటలో నడవమని చెప్పే రైతు నాయకుడు. తనను ఉత్తేజపర్చిన మరో తరం రైతు నాయకుడు కథలో వున్నారు. గ్రామాల్లో పరిస్థితులు ప్రత్యక్షంగా గమనిస్తూ, మరోవైపున వాటికి కారణమైన విధానాలపై పోరాటానికి తోడ్పాటునిస్తూ విద్యార్థి సంఘాలు చేసిన కృషిని భవిష్యత్తు తరలాకు రికార్డు చేసి అందించాడు. స్వల్ప సమస్యలున్నా ఆధునికత, స్థానికత మేళవించి తనదైన ఒక భాషలో, తనదైన శైలిలో సామెతలు, పోలికలతో గ్రామీణ జీవితం నుంచేతీసుకోవడం ఈ నవలలో మరో ప్రత్యేకత. రావణ్, చందు, స్నేహా, రవి, సీత, ఇంకా ఈ నవలలో వచ్చే చాలా పాత్రలు అమిత సహజంగా వుండి మనం రోజూ కలుసుకునే యువతీ యువకులను గుర్తు చేస్తాయి. వారి చమత్కారాలు, అలంకారాలు, హాహాకారాలు అన్నీ జీవితంలోంచి వచ్చినట్టే మనం అనుభూతి చెందుతామంటే అది రచయిత విప్లవకుమార్ ప్రతిభకు నిదర్శనం. విద్యార్థుల తరగతులలో ప్రత్యేకించి పుస్తకాల గురించిన చర్చ కూడా స్టడీ క్యాంపుల అవశకతను, ప్రయోజనాన్ని తెలియచేస్తుంది. ఇవన్నీ కొంతమందికి కొత్తగా వుండొచ్చుగానీ సమాజంలో సమాంతర సమవాద శక్తుల ప్రస్థానం నిరంతరాయంగా సాగుతూనే వుంటుంది. 'అధ్యయనం పోరాటం', 'చదవుతూ పోరాడు - చదువుకై పోరాడు' వంటి నినాదాలతో విద్యార్థి సంస్థలు ఆ కృషిని నిర్విరామంగా సాగిస్తూనే వుంటాయి. ఎంతటి ఉద్యమకారులైనా విప్లవ యోధులైనా మానవ సంబంధాలకూ మమతానురాగాలకూ అతీతులు కాదు. సరికదా మానవజాతి పట్ల సాటిమనుషుల పట్ల వున్న ప్రేమానురాగాలే వారిని అంతటి త్యాగాలకూ,సాహసాలకూ పురికొల్పుతాయి. ఈ నవలలో రావణ్, సీత ప్రేమ పరిణామం అలాంటిదే. రచయిత ఈ పార్శ్వం పైనా చాలా శ్రద్ధ పెట్టడం ద్వారా ప్రేమ పరిమళం అద్దే ప్రయత్నం చేశారు. కులాంతర వివాహాలు, పరువు హత్యల సంస్కృతికి మూలాలేమిటో రేఖామాత్రంగా వివరించారు.
ప్రేమికులు మాత్రమే గాక స్నేహితులు ఉద్యమ సహచరుల మధ్య వుండే మానవీయ సంబంధాలకు అర్హతకూ అద్దం పట్టారు. నాయకుడైన రావణ్ ఉద్య మాన్ని, తన ప్రేమను ఏకకాలంలో సమన్వయం చేసిన తీరు అబ్బురపస్తుంది. ఇందులో ఇప్పటి తరం ప్రయోగాలు, పదాలు పదబంధాలు, వెక్కిరింపులు సంకేతాలు కూడా చూపించారు. ఆ విధంగా మూస ధోరణి నివారించడంతో పాటు జీవితవైవిధ్యాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం రచయిత చేశాడు. విద్యుత్ ఉద్యమం తారస్థాయిగా 2000 ఆగష్టు 28న జరిగిన ఘటనలు పాలకుల ప్రోద్బలంతో పోలీసులు పైశాచికాలు, అమానుషాలు, ముళ్లకంచెలు ఛేదించిన సాహస వీరుల సమరశీలత వీటితో నవల మొదలై ముగుస్తుంది. మనకు తెలియకుండానే ఆ కాలంలోకి వెళ్లిన అనుభూతికి లోనవుతాం. పోరాటం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు యుద్ధకేత్రంలో వీరోచిత పోరాటం చేస్తున్న సమయంలో సీత రాసిన లేఖ రావణ్ కు అందుతుంది. ఆ లేఖ చదివిన రావణ్ తరువాత స్నేహా, రావణ్ మధ్య జరిగిన సంభాషణ ప్రతి ఒక్కరినీ ఉద్యమం కార్యోన్ముకులను చేస్తుంది.
- అనంతోజు మోహన్ కృష్ణ.